‘జై లవకుశ’తో బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని అందుకున్నారు ఎన్టీఆర్. జై.. లవ.. కుశగా మూడు పాత్రల్లో ఆయన అభినయం ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేసింది. ముఖ్యంగా నత్తితో ‘జై’ పాత్ర పలికిన సంభాషణలు విశేషంగా అలరించాయి. త్వరలో ఆయన మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో ఓ సినిమా చేయనున్నారు. ఈ చిత్రానికి యువ సంగీత దర్శకుడు అనిరుధ్ స్వరాలు సమకూర్చనున్నారు. ఈ విషయాన్ని అనిరుధ్ స్వయంగా వెల్లడించారు.
సోమవారం అనిరుధ్ పుట్టిన రోజు సందర్భంగా ఆయన ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూ వీడియోను హారిక, హాసిని క్రియేషన్స్ అభిమానులతో పంచుకుంది. ఈ సందర్భంగా అనిరుధ్ మాట్లాడుతూ.. ఎన్టీఆర్-త్రివిక్రమ్ కాంబినేషన్లో తెరకెక్కబోయే చిత్రానికి కూడా తానే స్వరాలు సమకూరుస్తున్నట్లు తెలిపారు. తన పుట్టిన రోజు సందర్భంగా ఈ విషయాన్ని పంచుకుంటున్నందుకు చాలా సంతోషంగా ఉందన్నారు.
ప్రస్తుతం త్రివిక్రమ్.. పవన్కల్యాణ్ 25వ చిత్రాన్ని తెరకెక్కించే పనిలో ఉన్నారు. కీర్తి సురేష్, అను ఇమ్మాన్యుయేల్ కథానాయికలు.