తారక్ 28వ చిత్రం మొదలైంది. త్రివిక్రమ్ దర్శకత్వంలో వస్తున్న ఈ చిత్ర పూజా కార్యక్రమం సోమవారం హైదరాబాద్లో ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి పవర్స్టార్ పవన్ కల్యాణ్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. పూజా కార్యక్రమం తర్వాత సినిమాకు పవన్ తొలి క్లాప్ కొట్టారు.
అయితే క్లాప్ కొట్టేటప్పుడు ‘నాకివన్నీ భయం సర్.. చేతులు వణుకుతున్నాయ్. క్లాప్ కొడుతూ ఏం చెప్పాలి.’ అని పవన్ కల్యాణ్ అడిగిన ప్రశ్నకు తారక్తో పాటు అక్కడున్నవారంతా గొల్లున నవ్వారు. ఆ తర్వాత దర్శకుడు త్రివిక్రమ్ ‘తారక్ దండం పెట్టుకుంటాడు. ఆయన కెమెరా స్విచాన్ చేస్తాడు.’ అని చెప్తుంటే ఇందుకు పవన్ ‘దాక్కోవాలా’ అని సెటైర్ వేశారు. క్లాప్ కొట్టిన తర్వాత తారక్ దేవుడికి దండం పెట్టుకోవాలి. అప్పుడు ‘నేను ఏ వైపు తిరిగి దండం పెట్టాలి. లుక్ ఇటా అటా’ అంటూ తారక్ వేసిన ఫన్నీ ప్రశ్నలు నవ్వులు పూయించాయి.
పవన్ క్లాప్ కొట్టిన తర్వాత క్లాప్ బోర్డు పక్కకు తీసేయాలి. కానీ ఆ సమయంలో పవన్కు ఏం చేయాలో అర్థంకాక క్లాప్ కొట్టి కింద కూర్చుండిపోయారు. తారక్ వెనక్కి తిరిగి చూసేసరికి పవన్ కూర్చుని కన్పించడంతో ఆయన నవ్వాపుకోలేకపోయారు. ఆ తర్వాత గ్రూప్ ఫొటో దిగుతుండగా తారక్ పవన్ను మధ్యలో నిలబడమన్నారు. కానీ పవన్ తారక్నే నిలబడాల్సిందిగా బలవంత పెట్టారు. అలా మూడు పంచ్లు ఆరు సెటైర్లతో పూజా కార్యక్రమం సరదాగా సాగిపోయింది.
ఈ కార్యక్రమంలో తారక్తో పాటు ఆయన సతీమణి లక్ష్మీ ప్రణతి, తనయుడు అభయ్రామ్ కూడా పాల్గొని సందడి చేశారు. హారికా-హాసిని క్రియేషన్స్ బ్యానర్పై ఈ చిత్రాన్ని ఎస్.రాధాకృష్ణ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ఈ చిత్రానికి ఇంకా టైటిల్ ఖరారు కాలేదు. ప్రస్తుతం పవన్ కల్యాణ్-త్రివిక్రమ్ కాంబినేషన్లోనూ ఓ చిత్రం వస్తోంది. ఈ సినిమాకు ‘అజ్ఞాతవాసి’ టైటిల్ను పరిశీలిస్తున్నారు.